Pages

Saturday 25 May 2013

వేసవనేది లేకపోతే మధురమైన జ్ఞాపకాలే లేకుండా పోతాయి!

`ఎండ నిప్పులు చెరుగుతుంది.`
`వేసవితాపం శృతిమించిపోతుంది.`
`ఇలాంటి ఎండలు నేను ఎప్పుడూ చూడలేదు.`
`జనాలు ఎండవేడికి పిట్టాల్లా రాలిపోతున్నారు`
`అసలు వేసవనేది లేకపోతే?` ......
ఇలాంటి మాటలు నాకు ఊహ తెలిసిన దగ్గరనుంచీ ప్రతీసంవత్సరం వింటున్నాను. క్రమంగా వేసవి తాపం పెరుగుతున్న మాట వాస్తవమే కానీ, అసలు వేసవనేది లేకపోతే మనకి మధురమైన జ్ఞాపకాలే లేకుండా పోతాయి. 

వేసవితో మనందరికీ లవ్‌హేట్ రిలేషన్ షిప్ ఉంటుంది. కమ్మగా పాడే కోయిలపాటలు ఇప్పుడే వినిపిస్తూ ఉంటాయి. పిల్లలకి శెలవులు, కావలసినంత సమయం, చదువనే బాధ్యతలేకుండా బలాదూరు తిరగ గలిగిన అవకాశం ఉన్న కాలం.. అమ్మమ్మ, తాతయ్య ఇంటిలో కజిన్స్‌తో కలిసి ఆటలాడుకోవడం...  అన్నీ ఈ కాలలంలోనే కుదురుతాయి. పచ్చిమామిడికాయ బద్దలకి ఉప్పూకారం అద్దుకొని తిన్న సందర్భాలు జ్ఞాపకం ఉన్నాయా? చిన్నప్పుడు చెరువుల్లో, దొరువుల్లో చల్లటినీటిలో జలకాలాడినప్పటి జ్ఞాపకాలు వేసవి కాలంలోనివే. పుచ్చకాయల్లో తియ్యని నీళ్ళు, మావిడిపళ్ళ మధుర రసం, ముంజికాయల్లో మృదువైన ముంజులు, నోరూరించే హిమక్రీములు, పళ్ళరసాలు, మల్లెపువ్వులు వేసవి ఆనందాలకి కొనసాగింపు. అయితే... ఎండలు మండే కాలంలో ఉక్కబోత, చెమట, గాళుపులు, పవర్‌కట్‌లు నచ్చని విషయాలు. ఎండ వేడి లేకపోతే ఊటీ గురించో, కాశ్మీరు గురించో ఆలోచించే వాళ్ళు ఎవరయినా ఉంటారా?   వడదెబ్బ, నోరు పిడచకట్టుకొనిపోవడం  మరి ఏ ఇతర కాలంలోనూ మనల్ని ఇబ్బంది పెట్టవు.  కానీ... అంతగా దాహార్తి ఉంటుందికనుకనే పుచ్చకాయలో, కొబ్బరిబొండాలో... పుల్లయిసులో, చెరుకురసమో ఈ కాలంలో ఉన్నంత అద్భుతంగా మరెప్పుడూ ఉండవు.  

ఎవరో అన్నారు, `మనకే కాదు ఈ రోజు లంబసింగి లోనే 42 డిగ్రీలు దాటిందట,` అని. లంబసింగి గురించి అంతకుముందు ఎప్పుడో విన్నాను. ఎక్కువ వర్షంకురిసేచోటో, మంచుకురిసే ప్రదేశమో జ్ఞాపకంలేదు. ప్రతీ సందేహానికీ సమాదానం చెప్పే గూగుల్ గూటిలో రాసిపెడితే, ఒక వీడియోని నా చేతిలో పెట్టింది .మీ ఉక్కబోతని మరచిపోయి - చలిదుప్పట్లు కప్పుకొనితిరుగుతున్న గిరిపుత్రుల్ని కాసేపు చూడండి. ఇలాంటి ప్రదేశానికి చలో అంటే బాగుంటుంది కదా? ఈ ఏడాదికి నాకయితే సాధ్యం కాదులెండి. ఈ రోజు కన్న కలని మరో వసంతానికి వాయిదా వేస్తే, ఈ వేసవి వెళ్ళిన దగ్గరనుంచీ, మళ్ళీవేసవికోసం ఎదురు చూడాలి! 

`వడదెబ్బ బారిన పడకండి, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంద`ని పేపర్లలో, టీవీల్లో చెపుతున్నారు. ఎండవేడికి తట్టుకోలేక చెట్ల కొమ్మలపైనుంచి నేలరాలుతున్న గబ్బిలాలూ, పక్షులు; దాహార్తితో కుళాయిల దగ్గర చేరుతున్న చిన్న చిన్న జంతువులు; కర్ఫ్యూ విధించినట్టు జనసంచారంలేక నిర్మానుష్యంగా ఉన్న రోడ్లు, ముఖ్యమైన పనులతో, తప్పనిసరి ప్రయాణాలతో మార్గమధ్యంలోనే ప్రాణాలుపోగొట్టుకొంటున్న వృద్దులు, యువకులు, పిల్లలు...ప్రతీరోజూ  చూడవలసివస్తున్న వార్తలు. వెలుగు ఉన్నప్పుడు, చీకటి ఉన్నట్టు -  ఇవికూడా వేసవికే ప్రత్యేకం.  

ప్రతీ మేఘానికీ వెండి అంచు ఉన్నట్టు భరించలేని వేసవికి కూడా పైన చెప్పిన కొన్నిప్రత్యేకతలు ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకొని, మండేకాలాన్ని దాటేస్తే మట్టివాసనతో వర్షాకాలం వచ్చేస్తుంది.
  
© Dantuluri Kishore Varma 

Tuesday 21 May 2013

రక్తదానం

దేశంలో ఏ మూలనైనా ఏ గ్రూపు రక్తదాతలు కావలసివచ్చినా వెంటనే లభ్యమయ్యే విధంగా friends2support.org అనే వెబ్‌సైట్ ద్వారా విశేషసేవలు అందిస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌లోనికి వెళ్ళి, కనిపిస్తున్న ఫీల్డ్స్‌లో

1.కావలసిన బ్లడ్‌గ్రూప్
2.రాష్ట్రం
3.జిల్లా
4.నగరం

ఎంచుకొని, సబ్‌మిట్ చేస్తే; మీప్రాంతంలో అందుబాటులో ఉన్న రక్తదాతల వివరాలు వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా కనిపిస్తాయి.  

ఇప్పటికే ఈ వెబ్‌సైట్‌ద్వారా లక్షకి పైగా రక్తదాతలు తమ పేర్లు నమోదు చేసుకొని ఉన్నారట. కొత్తగా ఎవరైనా దాతలు తమపేర్లు ఈ సైటుద్వారానే నమోదు చేసుకోవచ్చు.

ఈ రోజు డెక్కన్‌క్రానికల్ న్యూస్‌పేపర్‌లో ఈ స్వచ్చంద సేవకుల గురించి వచ్చిన వార్త చూసి, అందరికీ ఉపయోగ పడుతుందనే ఉద్దేశ్యంతో వివరాలు ఇస్తున్నాను.

© Dantuluri Kishore Varma 

కాకినాడ ఎక్స్‌పెరిమెంట్‌

ఒక దేశం అభివృద్ది సాధించాలంటే, సంపదలతో తులతూగాలంటే వ్యవసాయం, పరిశ్రమలు ప్రధానమైన పాత్ర పోషించాలి. భారతదేశంలాంటి చాలా దేశాల్లో వ్యవసాయం సాంప్రదాయకమైన వృత్తిగా ఉన్న కారణంగా చాలా కాలం ఒకతరం తరువాత మరొకతరం సాగుచేసే మెళుకువలని అందిపుచ్చుకొంటూ ముందుకు సాగింది. తర్వాత క్రమంగా వేరే రంగాల్లో కూడా అభివృద్ది సాధించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ సొంత వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించాలంటే; పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలంటే వ్యక్తులకి కావలసిన మార్గదర్శకత్వం ఎక్కడినుంచి వస్తుంది?  

వ్యాపార ఆలోచనని ఆచరణలో పెట్టడానికి కావలసిన ప్రణాళిక, మూలధనం సమకూర్చుకోవడం, మానవ వనరులు నిర్వాహణ, సంస్థని విజయవంతంగా నడిపించడానికి అవసరమయ్యే నాయకత్వ లక్షణాలు మొదలనవి ఎలా సమకూరుతాయి? ఇవి వ్యాపారవేత్తల వంశంలో పారంపర్యంగా వస్తాయా? వ్యవసాయ లేదా వృత్తి పరమైన నేపద్యం నుంచి వచ్చిన వాళ్ళకి అవి అందుకోలేనంత ఎత్తులో ఉండిపోతాయా? ఈ సక్సెస్ సూత్రాలని సామాన్యులకి కూడా నేర్పించ గలిగితే ఎన్నో కొత్త వ్యాపార ఆలోచనలు సఫలీకృతమై, దేశ ఆర్థికవ్యవస్థ పురోగతి సాధిస్తుంది. కానీ, వాటిని నేర్పించడం సాధ్యమేనా?
సాధ్యమే అని నిరూపించడానికి అవసరమైన ప్రయోగం 1961వ సంవత్సరంలో జరిగింది. కాకినాడ ఎక్స్‌పెరిమెంట్‌గా ప్రపంచ వ్యాప్తంగా ప్రశిద్దమైన ఈ ప్రయోగం  ఎన్నో దేశాలలో `ఎంటర్‌ప్రెన్యూవర్  డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(EDP)లకి` అధారమైంది. డేవిడ్ మెక్‌క్లేలాండ్ అనేఆయన `ఏదయినా పని పూర్తిచెయ్యలనే తపనని కలిగిస్తే, ఎవరయినా ఏదయినా సాధించగలర`నే సూత్రాన్ని నిరూపించడానికి మన రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి 51 మంది వ్యక్తులని ఎంపికచేసి, హైదరాబాద్‌లో మూడు నెలల శిక్షణా తరగతులు నిర్వహించారు. ఇది విజయవంతం అయ్యింది. శిక్షణలో పాల్గొన్న వ్యక్తులు వాళ్ళ లక్ష్యాలని చేరుకోవడంలో సఫలీకృతం అయ్యారు.  డేవిడ్ మెక్‌క్లేలాండ్ `ఎచీవింగ్ సొసైటీ` అనే తన పుస్తకంలో  ఈ విషయాలని పొందుపరచాడు. అయితే ఏమిటట అంటారా?  

ఈ పరిశోధనా ఫలితాలని ఆధారంగా చేసుకొని మనదేశంలో పెద్ద ఎత్తున ఎంటర్‌ప్రెన్యువర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఈడీపీని అందిస్తున్నాయి. ఈ హవా మనదేశం తోనే ఆగిపోలేదు. అమెరికా, ఇంగ్లండ్ లతో సహా ఇంకా చాలా దేశాలు కాకినాడ ఎక్స్‌పెరిమెంట్ నుంచి స్పూరి అందుకొని ఈ శిక్షణని అందిస్తున్నాయి. ప్రపంచ పారిశ్రామికాభివృద్ది శిక్షణకి పునాది మనకాకినాడలో ఉండడం గర్వకారణమే కదా!

© Dantuluri Kishore Varma

Friday 17 May 2013

కథ అంటే?

కథలు రాయాలనే ఆసక్తి నాకు చిన్నప్పటినుంచీ ఉండేది. అయితే, రచయితగా మారలేక పోవడానికి కారణం కథరాసి, పత్రికలకి పంపి, నెలకో ఆరునెలలకో ప్రచురింపబడుతుందో, త్రిప్పి పంపబడుతుందో తెలియకుండా ఎదురుచూస్తూ ఉండేటంత సహనం లేకపోవడం ఒక కారణం అయితే; వ్రాయడంలో మెళుకువలను తెలుసుకోవడానికి,  సందేహాలుంటే నివృత్తి చేసుకోవడానికి వాటిగురించి తెలిసిన పెద్దవాళ్ళెవరితోను పరిచయాలు లేకపోవడం రెండవ కారణం. సంగీతం, నాట్యం, చిత్రలేఖనం లాంటివి నేర్చుకొన్నట్టు కథలు రాయడం నేర్చుకోవడానికి రైటర్స్ వర్క్‌షాప్‌లు అందరికీ అందుబాటులో ఉండవు. చాసో, సత్యం శంకరమంచి, వంశీ, పాలగుమ్మి పద్మరాజు, ముళ్ళపూడివెంకటరమణ... లాంటి రచయితల రచనలు చదివి కొంతవరకూ స్టోరీ క్రాఫ్ట్‌ని నేర్చుకొంటే; సంఘటనలని, మనుష్యులని పరిశీలించడంద్వారా మరికొంత నేర్చుకోవచ్చు అనుకొంటాను.

సుమారు ఒక సంవత్సరం క్రిందట బ్లాగ్‌లోకంలోకి వచ్చినతరువాత ఎప్పటిదో ఆసక్తి మళ్ళీ తెరమీదకి వచ్చింది. మిగిలిన విషయాలతో పాటూ అడపాదడపా ఓ పది కథలు రాశాను. నిజానికి వాటిని కథలు అనవచ్చో, లేదో కూడా సరిగ్గా తెలియదు నాకు. ఎందుకంటే, ఈ కథల్లో కొన్నింటి నిడివి చాలా తక్కువ. ఇంత చిన్న కథలని చాలా కాలం క్రితం ఈసప్ అనే ఆయన రాశాడు. తరువాత ఒకటి రెండు తెలుగు పత్రికల్లో కాలం దాటని కథలు అని వచ్చేవి. ఇంగ్లీష్ రచయిత ఓ హెన్రీ రాసిన కథల్లోలాగ చివ్వరి వాఖ్యంలో ఊహించని ముగింపు ఉంటే ఇటువంటి చిన్న కథలు రక్తి కడతాయి.  

నా బ్లాగ్‌లో కథలు అనే లేబుల్‌తో ఉన్న వీటి లింకుని, `కథ` అనే ఫేస్‌బుక్ గ్రూపులో ఇచ్చి, ఆ గ్రూపుసభ్యులని విశ్లేషించమని కోరడం జరిగింది. కొంతమంది సభ్యులు తమ విలువైన సమయం కేటాయించి వీటిని చదివి అభిప్రాయాలు తెలియజేశారు. రాసే విధానం బాగుందని.. పాత్రల స్వభావాన్ని పూర్తిగా వ్యక్తీకరించడానికి కథ నిడివి పెంచాలని సూచించారు.

సందర్భం వచ్చింది కనుక, కథగురించి అవగాహన పెంచుకోవడానికి ప్రేంచంద్ సాహిత్యవ్యాసాలు, బుచ్చిబాబు సాహిత్యవ్యాసాలు, మల్లాది వెంకట కృష్ణమూర్తి, యండమూరి వీరేంద్రనాథ్‌లు రాసిన `కథలు ఎలా రాస్తారు?` అనే పుస్తకాలు, ఇంకా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని కొంత చదివాను. 

కథలకి వివిధ నిర్వచనాలు కనిపించాయి. వాటిల్లో ఒకటి మాత్రం చదివిన వెంటనే బాగా ఇంప్రెసివ్‌గా అనిపించింది. 

కథ చెప్పడం అంటే కొంతమందిని సినిమాకి తీసుకొని వెళ్ళడం లాంటిది. దర్శకుడు తనుతీసిన సినిమాని ఎలా తెరమీద చూపిస్తాడో రచయితకూడా మనసులో ఊహించుకొన్న విషయాన్ని అలానే పాఠకుల మనసులమీదకి ప్రొజెక్ట్ చెయ్యడమే కథచెప్పడం.

నిర్వచనం బాగుంది కదా?

వాఖ్యం వాఖ్యానికీ కథని ముగింపువైపు తీసుకొనివెళుతూ, అవసరమైన చోట వర్ణనల్ని, సంభాషణల్ని ఉపయోగిస్తూ రాస్తే చిన్న కథయినా, పెద్ద కథయినా అందగిస్తుందనుకొంటాను.

© Dantuluri Kishore Varma 

Wednesday 15 May 2013

కాటన్

మేం వచ్చాం,
మేం చూశాం,
మేం గెలుచుకొన్నాం.....

జూలియస్ సీజర్ మాటల్ని తెల్ల వాళ్ళు తమకి ఆపాదించుకొని తిరిగి చెప్పవచ్చు. యావత్తు జాతినీ శృంకలాల్లో బంధించి పరిపాలించారుకనుక ఒకవిధంగా ఈ మాటలకి అర్థం ఉంటుంది.  కానీ ఇక్కడ ఉపయోగించిన `గెలుచుకొన్నాం` అన్న మాట హృదయాలకు సంబంధించినదైతే, అది కేవలం కొంతమంది వ్యక్తులకి మాత్రమే సరిగ్గా  సరిపోతుంది. అటువంటి కొద్ది మందిలో అపరభగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ ముఖ్యమైన వాడు. గోదావరి జిల్లాల్లో కాటన్ విగ్రహాలు నాలుగువేలదాకా ఉన్నాయంటే జనం గుండెల్లో ఈ ఆంగ్లేయుడు ఏవిధంగా గూడుకట్టుకొని ఉండిపోయాడో అర్థమౌతుంది. కొన్ని గ్రామాల్లో అయితే కాటన్ ప్రతీ జయంతి రోజునా(మే 15) ఆయన విగ్రహాలకి అభిషేకాలు చేసి ఉత్సవాలు జరుపుతారు. 
దవళేశ్వరంలో ఆనకట్ట నిర్మించి ఉండకపోతే ఉభయగోదావరి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్షయపాత్రగా మారిఉండటానికి బదులుగా,  లక్షల ఎకరాలు నేల బీడువారిపోయి, ప్రజలు కరువుకాటకాల బారినపడి నశించి ఉండేవారు. 

`ఆనకట్ట నిర్మించడం లాంటి పనిని ప్రభుత్వం అప్పజెపితే ఏ ఇంజనీరయినా పుర్తిచేస్తాడుకదా, దానిలో కాటన్ యొక్క గొప్పతనం ఏముంది?` అని ఎవరికయినా అనిపించవచ్చు. కానీ, వ్యవసాయ అవసరాలకి ఉపయోగపడే కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు నిరుపయోగంగా సముద్రం పాలు అయిపోతుందని, దానిని అడ్డుకొని భూములని సస్యశ్యామలం చెయ్యవచ్చని ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి, పని ప్రారంభింప చేసిన ఘనత కాటన్‌కే దక్కుతుంది.  `గోదావరి నది మీద ఆనకట్ట ఎందుకు కట్టాలి?` అనే ప్రశ్నకి `వరదలు వచ్చిన సమయంలో గోదావరి నదిలో ఒక్కరోజు ప్రవహించే నీరు లండన్‌లో థేంస్ నది గుండా  ఒక సంవత్సరంపాటు ప్రవహించే నీటికి సమానం,` అని ఒక్క వాఖ్యంతో సమాదానం చెప్పి సందేహ నివృత్తి చేశాడట. 

కాటన్ జన్మించి 210 సంవత్సరాలయ్యింది. దవళేశ్వరం బ్యరేజ్ నిర్మించి నూట అరవై ఏళ్ళయ్యింది. కానీ కాటన్‌ జనాల మనసుల్లోఇప్పటికీ  నిలిచిపోయి ఉండడానికి కారణం  ఆయన మానవతావాదం.

© Dantuluri Kishore Varma

Tuesday 14 May 2013

ధన్యవాదాలు మూర్తిగారూ!

రివర్‌సైడ్‌మ్యాన్ కె.వి.వి.ఎస్.మూర్తిగారు అభిమానంతో గౌతమీన్యూస్ సైట్‌లో రాసిన పరిచయం. హృదయపూర్వక ధన్యవాదాలు మూర్తిగారూ!
© Dantuluri Kishore Varma 

Monday 13 May 2013

చాయిస్ ఈజ్ అవర్స్!

ఓ రెండుకథలు చదివాను. ఒకటి ఈ మధ్యన, రెండవది ఎప్పుడో. వాటిని నా మాటల్లో  క్లుప్తంగా చెపుతాను....

కథ 1:

రాజుగారు ఏనుగు అంబారీమీద ఎక్కి రాజవీధుల వెంట వెళుతున్నారు. సంవత్సరానికి రెండుసార్లు అలా వెళ్ళడం ఆనవాయితీ. ప్రజల కష్టసుఖాలని తెలుసుకోవడం, అవసరమయితే సహాయం చెయ్యడం అనేది దీనివెనుక ముఖ్యఉద్దేశ్యం. ఒక ముష్టివాడికి ఈ అవకాశం వదులుకోకూడదని అలోచన వచ్చింది. రోజూ ఒకేపని చెయ్యడం వాడికి కూడా విసుగ్గా ఉంది. ఒకేసారి రాజుగారిని దీనాతిదీనంగా అడుక్కొంటే మళ్ళీజీవితంలో బొచ్చెపట్టే అవసరం ఉండదు. రాజుగారి అంబారీ సమీపిస్తుండగా రాతిగుండెలు కూడా కరిగే విధంగా ఆక్రందించాడు. `మహారాజా నా కష్టాలని కడతేర్చండి, నాకేదయినా దానం చేసి పుణ్యం చేసుకోండి` అని స్పెషల్ఆఫర్ ఇచ్చాడు. 

`అందరిదగ్గరా తీసుకొంటునే ఉన్నావు కదా? నేను నీకు ఇవ్వడం కాదు, నువ్వే నాకు ఏదయినా ఇవ్వు` అన్నాడు రాజు. 

బిచ్చగాడికి కడుపు రగిలిపోయింది. `ఈ రాజు అడుక్కొనే వాడిదగ్గర తిరిగి అడుక్కొనేవాడిలా ఉన్నాడు` అని మనసులో అనుకొని, నాణాలతో కళకళలాడుతున్న బొచ్చెలోనుంచి ఒకేఒక్క సత్తురూపాయి తీసి రాజుమీదకి విసిరాడు. అంబారీ ముష్టోడిని దాటిపోతూ ఉండగా ఒక బంగారు నాణం వచ్చి వాడిమీద పడింది. రాజుగారు నవ్వుతూ అన్నాడు, `ఒకటికి ఒకటి` అని. 

బొచ్చెలో ఉన్న రూపాయలన్నీ ఇచ్చేస్తే ఎలా ఉండేదో తలచుకొని పొగిలి పొగిలి ఏడ్చాడు ఆ ముష్టోడు.   

కథ 2:  

ఓ కుర్రాడు ఐస్‌క్రీం కొనుక్కోవడానికి పార్లర్‌కి వెళ్ళాడు. వరుసగా అరలుగా ఉన్న గాజు డిస్‌ప్లేలో రకరకాల ఐస్‌క్రీములు ఉన్నాయి. మొదటిది చూపించి `ఇదెంత?` అని షాపువాడ్ని అడిగాడు.    

షాపువాడి సమాదానం - `ఐదు రూపాయలు`.

కుర్రాడు తరువాత అర చూపించి, `మరి ఇది?` అన్నాడు.

`ఎనిమిది రూపాయలు.`

`ఈ మూడోది?`

`ఇరవై. నీకు ఏమైనా కావాలా, వద్దా? నీదగ్గర ఉన్న డబ్బెంతో చెపితే, దానికి సరిపడా ఇస్తాను,` అన్నాడు విసుగ్గా.

`పదిరూపాయలు.`

`అయితే ఈ అయిదురూపాయలవి రెండువస్తాయి తీసుకో,` అన్నాడు.

`వద్దు. ఎనిమిది రూపాయలది ఒక్కటి చాలు,` అని పదిరూపాయలు కాగితం పార్లర్ వాడికి ఇచ్చి ఒక్క ఐస్‌క్రీంతో ఆనందంగా బయటకి నడిచాడు.

ఎనిమిదిరూపాయలు కొన్నదాని ధర, రెండురూపాయలు టిప్పూ చూసి షాపువాడికి నోట మాట రాలేదు.
*     *     *
ముష్టోడికి ఒక బంగారు నాణేమంత లాభం, ఏడుపూ మిగిలితే, కుర్రాడికి రెండురూపాయల నష్టం, తృప్తి మిగిలాయి. ఇవ్వడంలో ఉన్న దృక్పదమే వాళ్ళ విషయంలో విషాదానికి లేదా ఆనందానికి కారణం. ఇచ్చిపుచ్చుకోవడం రోజూ కొన్ని వందలసార్లు చేస్తూ ఉంటాం. ఇవ్వడం అనేది కేవలం డుబ్బురూపంలోనే కాకుండా సేవలు, ఆఫీసులోనో లేదా ఇంటిదగ్గరో బాధ్యతగా చెయ్యవలసిన పనులు, సలహాలు, ఎవరైనా మంచిపని చేసినప్పుడు ప్రశంసలు... ఇంకా చాలా రకాలుగా ఉంటుంది. ఎదుటివాళ్ళ గురించి ఆలోచించి చేసే పనిలో(Consideration for others) తృప్తి ఉంటే, స్వార్థంలో ఏడుపు ఉంటుంది.   

ఇచ్చినదానికి ప్రతిఫలంగా ఏమి పొందాలనేది నిర్ణయించుకోవలసింది మనమే. చాయిస్ ఈజ్ అవర్స్! 

 © Dantuluri Kishore Varma 

Saturday 11 May 2013

బెల్లం సున్నుండలు

కిటికీలోంచి ఉండుండి ఒక్కో పిల్లతెమ్మెర వస్తుంది. ఏదీకాని చోటులో ట్రెయిన్ ఆగిపోకుండా వెళుతూ ఉండుంటే బాగుండేది. బండి ఎందుకాగిందో, మళ్ళీ ఎప్పుడు కదులుతుందో తెలియదు. కౌశిక్ ఊచల్లోనుంచి ఆకాశంలోకి చూసున్నాడు. చందమామ అమ్మచేతిలోనుంచి జారి నేలమీద పడిన సున్నుండలా ఉంది. మరొకసారి ఎప్పుడయినా అయితే ఇంకోపోలిక ఏదో తోచివుండేది.
*     *     * 
ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి అమ్మదగ్గరకి వెళ్ళాడు. మద్యహ్నం సీరియస్‌గా చర్చ జరుగుతుంటే, `బెల్లం సున్నుండలు నీకు ఇష్టమని చేశాను. తిను` అంది. 

`అక్కర్లెద్దు!`అంటూ కోపంగా చెయ్యివిసిరాడు. ప్లేటుజారి నేలమీద పడింది. సున్నుండలు చెల్లాచెదురుగా నేల మీద దొర్లిపోయాయి. 

`సున్నండలు, అరిసలు, బొబ్బట్లు వీటికి మాత్రం లోటులేదు. నీకోడలు అడిగింది ఏమిటే అమ్మా? ఒక చిన్న బూటీక్ ప్రారంభించుకోడానికి నీ బంగారు గాజులో, గొలుసో ఇమ్మనే కదా? ఏం నీతో పాటూ తీసుకొని పోతావా?` అన్నాడు.  

`నీకు లక్షసార్లు చెప్పాను. నా వంటిమీద మిగిలినవి అవే ఇంక. అన్నీ నీకే దోచిపెడితే, తమ్ముడు ఏమయిపోవాలి? నాకు తోచినప్పుడు వాడిపిల్లలకీ, నీ పిల్లలకీ సమానంగా ఏవో వస్తువులు చేయించి పెడతాను. అంతవరకూ ఎవరు అరిచి గీపెట్టినా చిల్లిగవ్వ ఇచ్చేది లేదు,` అంది అంతే విసురుగా. 

`సమానం, సమానం, సమానం...` ఒళ్ళుమండిపోతుంది. అమ్మమీద కోపంతో ఏమీ తినకుండా తిరిగి బయలుదేరిపోయాడు. వచ్చేటప్పుడు నేలపాలు కాగా మిగిలిన రెండో, మూడో ఉండలు పొట్లం కట్టి బలవంతంగా బ్యాగ్‌లో పెట్టింది. కడుపులో నకనకలాడుతుంది. బ్యాగ్ జిప్ తీసి పొట్లం బయటకి తీసాడు.  రెండువుండలు ఉన్నాయి. నానమ్మ చేసిన స్వీట్లంటే కౌశిక్ పిల్లలు ఇద్దరికీ చాలా ఇష్టం. ఇంటికి వెళ్ళగానే `మాకేమిచ్చింది?` అని మీదపడతారు. రెండింటిలో ఒకటి తినేస్తే మిగిలిన ఒక్కటీ వాళ్ళకేమి  పంచుతాడు సమానంగా! సమానంగా, సమానంగా....

వాటిని మళ్ళీ లోపల పెట్టేసి, మినరల్ వాటర్ బాటిల్లో మిగిలిన నాలుగు చుక్కల నీళ్ళూ గొంతులో పోసుకొని కళ్ళు మూసుకొన్నాడు. ట్రెయిన్ కదిలింది.

సెల్‌ఫోన్ తీసి డయల్ చేశాడు. సగం రాత్రి అయ్యిందేమో! అయినా పరవాలేదు. అవతలినుంచి `హలో` అని వినిపించిన వెంటనే,`అమ్మా, భోజనం చేశావా?` అన్నాడు.
*     *     *  
అందరికీ హ్యాపీ మదర్స్ డే!
© Dantuluri Kishore Varma

Wednesday 8 May 2013

నాకు ఎందుకు అలా కనిపించడం లేదు!

ఒక వృద్దుడు - అరవై ఏళ్ళు ఉంటాయి-  రోడ్డు వారగా నడచి వెళుతున్నాడు. చేతిలో వాకింగ్ స్టిక్ ఉంది. మోటార్‌బైక్ ఒకటి అతనిని వొరుసుకొంటూ వేగంగా ముందుకు వెళ్ళింది. బైక్ నడుపుతున్న పాతికేళ్ళ కుర్రాడు వెనక్కితిరిగి పళ్ళన్నీ కనిపించేలా నవ్వాడు. `ముసలోడా..వాకింగ్ పార్క్‌లో చేసుకోవచ్చుకదా?` అన్నాడు. రోడ్డు వెంబడి కనిపించిన జనాలనందరినీ ఏదో ఒకటి అని ఆనందం పొందడం వాడికి అలవాటులా ఉంది. ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల కూడలినీ, అడ్డంగా రోడ్డు దాటుకొంటూ వెళుతున్న మామిడిపళ్ళతో ఉన్న తోపుడు బండినీ చూసుకోలేదు. ఒక్క క్షణంలో బైక్ ఆ బండిని గుద్దుకోవడం, బైక్ నడుపుతున్న కుర్రాడు ఎగిరి నేలమీద పడడం జరిగిపోయాయి. వాకింగ్ స్టిక్ తో నడుస్తున్న వృద్దుడు నాలుగు అంగల్లో అక్కడికి చేరుకొని కుర్రాడు పైకి లేవడానికి చెయ్యి అందించాడు. 
కొట్టుకుపోయి మండుతున్న మోచేతులూ, మోకాళ్ళను తడుముకొంటూ ఆ కుర్రాడు అడిగాడు, `వెటకారం చేసిన నేనంటే కోపం లేదా?` అని. 

పెద్దాయన అన్నాడు, `నా కొడుకు నీలానే తప్పుచేసి, తరువాత వాడికి ఇలా జరిగితే చూస్తూ ఊరుకోగలనా? నీ వయసు కుర్రాళ్ళలో నా కొడుకే కనిపిస్తాడు.`

`మీవయసు పెద్దవాళ్ళలో నాకు నా తండ్రి ఎందుకు కనిపించడం లేదు! నేను మారాలి` అనుకొన్నాడు ఆ కుర్రాడు.

© Dantuluri Kishore Varma 

Tuesday 7 May 2013

గ్రేప్ వైన్

హియరింగ్ త్రూ గ్రేప్ వైన్ అని ఒక నానుడి ఉంది. అంటే ఏదయినా విషయాన్ని ఆనోటా, ఈ నోటా వినడం. విన్నదాన్ని మిగిలినవాళ్ళకి చేరవెయ్యడం. సినిమారంగంలో, రాజకీయాల్లో, షేర్‌మార్కెట్లో,  రోజువారీ సంభాషణల్లో మన పరిచయస్తుల గురించి, బంధువుల గురించి గ్రేప్‌వైన్ పుకార్లు సహజం. వాఖ్యాలకి చివర `అట` తగిలించి అవీ, ఇవీ చెపితే దానికి ఎవరినీ బాధ్యులుగా చెయ్యడం సాధ్యం కాదు. పలానా హీరోయిన్‌కి ఆ అగ్రదర్శకుడితో సంబంధం ఉందట, ఈ నాయకుడు ఉన్న పార్టీని విడిచిపెట్టి ప్రత్యర్థి పార్టీలో చేరబోతున్నాడని బోగట్టా, ఎగిరే పళ్ళాలని రష్యాలో చాలా మంది చూశారట, డిసెంబరు 31 అర్థరాత్రికల్లా భూమి నాశనం అవుతుందని అందరూ అనుకొంటున్నారు, పలానా సిమ్మెంటు కంపెనీ షేర్లని ఎఫ్.ఐ.ఐలు  పెద్ద ఎత్తున కొంటున్నారట, హిమాలయాల్లో యతి అనే భీకరాకార మంచుమనిషి ఉన్నట్టు ఎవరో చెప్పారు, మన కొలీగ్ సుధీర్‌కి పింక్‌స్లిప్ ఇస్తారని విన్నాను, మేనేజర్ ఏకలింగంతొ సుజ్జీ కారులో లాంగ్ డ్రైవ్ కెళ్ళడం చూశారట.... ఇలాంటివి విన్నప్పుడు ఒకరకమైన కిక్కుతో ఊగిపోతాం. విన్నదాన్ని మరొకళ్ళతో పంచుకొంటే మరింత మజా పెరుగుతుంది. `గ్రేప్‌వైన్‌లో ఉన్న వైన్‌కి, ఈ కిక్కుకీ ఏమయినా సంబంధం ఉందా!?` అంటే లేదనే చెప్పాలి. కారణం ఏమిటంటే ఈ వైన్ ద్రాక్ష సారాకి(wine) చెందిన స్పెల్లింగ్ కాదు. ద్రాక్ష తీగకి(vine) చెందినది.

 "Heard it through the grapevine"

`అసలు గ్రేప్‌వైన్ అనే మాట ఎలా వాడుకలోకి వచ్చింది?` అని తెలుసు కోవడానికి చిన్న పరిశోధన చేస్తే తెలిసిన విషయం ఇది - అమెరికాలో అంతర్యుద్ధం(సివిల్ వార్) జరుగుతున్న రోజుల్లో సమాచార బట్వాడా ద్రాక్ష తీగల్ని పోలిన సన్నని టెలీగ్రాఫ్ వైర్ల ద్వారా జరిగేది. విషయాన్ని తొందర తొందరగా చెప్పడం, ట్రాన్స్‌మిషన్‌లో అంతరాయాలు మొదలైనవాటి వల్ల సమాచారంలో స్పష్ఠత ఉండేదికాదు. విన్నవాళ్ళు మిగిలిన వారికి చెప్పినా అది చాలా సందర్భాలలో అసలైన సమాచారానికి పొంతనలేకుండా ఉండేది. కాబట్టి ద్రాక్ష తీగల (టెలీగ్రాఫ్ వైర్లు)ద్వారా విన్నవి నమ్మదగినవి కావని అభిప్రాయం స్థిరపడిపోయింది. అందుకే వాళ్ళూ, వీళ్ళూ `అట` కలిపి చెప్పిన పుకార్లని హియరింగ్ త్రూ గ్రేప్ వైన్ అని వ్యవహరించడం మొదలైంది.

ఊరిలో ఈ మధ్యన ఒక విషయం గ్రేప్‌వైన్ ద్వారా వేగంగా వ్యాపిస్తుంది.  దొంగలముఠా ఒకటి దిగింది అని, పట్టపగలు మెడలో గొలుసులు లాగేస్తున్నారు అని, టార్జాన్‌లాంటి ఒక వ్యక్తి చెట్టుకొమ్మల మీదనుంచి స్పైడర్ మ్యాన్‌లా జంప్ చేసుకొంటూ తిరుగుతున్నాడని... ఇంకా చాలా, చాలా. కొన్ని ప్రాంతాల్లో అయితే నలభై, యాభై మంది పౌరులు చేతుల్లో కర్రలు, ఫోకస్ లైట్లు పట్టుకొని రాత్రిపూట వీధుల్లో పహారా తిరుగుతున్నారు. ఒకటి రెండు చోట్ల పోలీస్ పికెట్‌లు ఏర్పాటు చేశారు. రోజూతిరిగే ప్రాంతాల్లో కాకుండా కొత్త ప్రాంతాలకి ఎవరైనా చీకటి పడిన తరువాత పనిమీద వెళితే వీళ్ళు ఆపి ప్రశ్నించే అవకాశం ఉంది. నోటితో అడిగితే పరవాలేదు, మూకుమ్మడిగా కర్రలతో అడిగితేనే కష్ఠం!

© Dantuluri Kishore Varma

Monday 6 May 2013

కాకినాడలో ఆయిల్ రిఫైనరీలు

కాకినాడ ప్రత్యేకత ఏమిటంటే తడుముకోకుండా కాజా అని చెప్పేస్తారు చాలా మంది. కాజా కాకపోతే సుబ్బయ్య హోటల్. వినేవాళ్ళకి మొహం మొత్తేస్తుంది. మొన్న ఒకాయన చుట్టపుచూపుగా వచ్చినప్పుడు స్వీటూ, హాటూ తినడానికి పెడితే `వద్దంటే, వద్దు,` అన్నాడు. `ఇది బ్రెడ్డుతో చేసిన పాకం స్వీటు. చెట్టునుంచి అప్పుడే తీసిన తేనెపట్టులా ఉంటుంది` అన్నా ససేమిరా అన్నాడు. పైపెచ్చు మొహం అదోలా పెట్టడంతో కొంచం నొచ్చుకోవలసి వచ్చింది. మా ఫీలింగ్స్ అర్థమయ్యాయేమో `నా కొక స్వీట్ల దుకాణం ఉందండీ. అందుకే ఏ తీపిపదార్ధం చూసినా కడుపులో తిప్పినట్టు అవుతుంది,` అని వివరణ ఇచ్చాడు. ఆ వ్యక్తి బాధ కూడా సమంజసమైనదే! అలాగే కాజా, కాజా, కాజా...అని అదేపనిగా చెబుతున్నా వినేవాళ్ళకి వికారం మొదలవడం ఖాయం. కాకినాడకి నిజానికి పైన చెప్పిన రెండు విశేషాలే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి కాజాని కొంచంసేపు ప్రక్కన పెట్టి మిగిలిన విశేషాల గురించి తెలుసుకొందాం.
*     *     *
శెలవులు ఇచ్చేశారు, ఎక్కడికైనా తీసుకు వెళ్ళమని పిల్లలు గొడవ చేస్తున్నారు. మొహంమొత్తే ప్రతీసారీ తీసుకువెళ్ళే ప్రదేశాలకి వద్దని కండీషను ఒకటి మళ్ళీ! మా అన్నయ్య పృథ్వీరాజు  ఒక ఆయిల్ రిఫైనరీలో ఉద్యోగ బాధ్యతలు  నిర్వహిస్తూ ఉన్నాడు కనుక అక్కడికి తీసుకు వెళితే వెరైటీగా ఉంటుంది ప్లస్ విజ్ఞానంకూడా.
ఫ్యాక్టరీకి వెళ్ళి అన్నీ చూశాకా మన కాకినాడ యొక్క మరొక ప్రత్యేకత తెలిసింది. వెజిటబుల్ క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడంలో దేశంలోనే నాలుగవ అతిపెద్ద పోర్టుగా కాకినాడ ఉంది. రుచీ, అకల్‌మార్, నిఖిల్, అగర్వాల్, లోహియా లాంటి సుమారు పది చమురు శుద్ది కర్మాగారాలు వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియాలో ఎడిబుల్ ఆయిల్ తయారు చేస్తున్నాయి. కార్గో షిప్పులద్వారా పోర్టుకి చేరిన ఆయిల్ని పైపులైన్ల ద్వారా ఈ ఫేక్టరీలకి సరాసరి పంపించేస్తారు. 
రిఫైనరీలో క్రూడాయిల్ విపరీతంగా వేడిచెయ్యబడుతుంది. అప్పుడు దీనిలో ఉన్న వేరువేరు పదార్ధాలు వేరు వేరు ఉష్ణోగ్రతలవద్ద ఆవిరిగా మారతాయి. ఈ  ఆవిరిని తిరిగి చల్లార్చడంద్వారా వివిధ పదార్ధాలని వేరుచేస్తారు. నూనె శుద్దిచేసినతరువాత రిఫైండ్ ఆయిల్, వనస్పతి, బేకరీషార్టెనింగులుగా విడగొట్టబడి ప్యాకింగ్ విభాగానికి పైపులైను ద్వారా పంపించబడుతుంది. ప్యాకింగ్ సెక్షన్లో మెషీన్‌ల వద్ద పేకెట్లగా, డబ్బాలుగా తయారు చేస్తారు. వనస్పతీని కోల్డ్ స్టోరేజిల్లో 15 డిగ్రీలకి చల్లబరచడం వల్ల  గడ్డకట్టి పేరుకొంటుంది. దీనిని కూడా ప్యాక్‌చేస్తారు.
హెరిటేజ్, ఫ్రీడం, రుచి గోల్డ్, గోల్డ్‌మొహర్ లాంటి బ్రాండ్ వంటనూనెలు ఇక్కడే తయారయి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. మిగిలిన రాష్ట్రాలకి కూడా ఎగుమతి అవుతున్నాయి.  కాకినాడ రిఫైనరీల్లో తయారయ్యే బిస్కెట్ ఆయిల్‌ని భారతదేశంలో ప్రముఖ బిస్కెట్ కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నాయి.  బేకరీల్లో, స్వీట్‌షాపుల్లో వనస్పతి, బేకరీ షార్టెనింగుల్ని ఉపయోగిస్తారు. ఆఖరికి కాకినాడ కాజా తయారీలో కూడా వీటి ఉపయోగం తప్పనిసరి.
*     *     *
150వ టపా ఇది!
© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!