Pages

Monday 15 July 2013

యుద్దం

"ఇంటర్‌స్కూల్ వ్యాసరచన పోటీలు జరగబోతున్నాయి. మన పాఠశాల నుంచి తరగతికి ఒకరిని చొప్పున ఎంపికచేసి పంపించవలసిందని వర్తమానం వచ్చింది. ఈ క్లాసునుంచి సుధీర్ని పంపుతున్నాం," అని క్లాస్ టీచర్ విద్యార్థులకి చెప్పారు. 

"నేను వెళతాను సార్," అన్నాడు చందూ.

"కానీ, నీకు వ్యాసరచనలో అనుభవంలేదు. డ్రాయింగ్ పోటీలు నిర్వహించినప్పుడు నిన్ను పంపిస్తాం," అన్నారు టీచర్.

"పోటీలకు పంపినప్పుడే కదా సార్ అనుభవం వచ్చేది," అన్నాడు.

"మనకి కంపోజిషన్ క్లాసులు జరుగుతున్నాయి. వాటిలో నువ్వు ఆసక్తితో నేర్చుకో. రాయడంలో మెళుకువలు అలవాటు అయ్యాయని అనిపించినప్పుడు నిన్ను తప్పనిసరిగా ఎంపిక చేస్తాను. అప్పటివరకూ నువ్వు ఏమిచెప్పినా  యుద్దం చెయ్యగలనని గొప్పలు చెప్పిన రంగన్నలా అవుతుంది నీ పరిస్థితి."

"వాడు ఎవరో చెప్పండి సర్," అన్నారు పిల్లలందరూ ముక్తకంఠంతో.  

అప్పుడు పంచతంత్రం నుంచి టీచర్ ఈ కథ చెప్పారు.
ఒక ఊరిలో రంగన్న అనే కుండలుచేసేవాడు ఉన్నాడు. ఒకరోజు సాయంత్రం వరకూ కుండలు చేసి, వాటిని బజారులో అమ్ముకొని, ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో కల్లు దుకాణం దగ్గర పీకలవరకూ తాగాడు.  ఇంటికివెళ్ళడంతోనే పెరటిలో ఆరబెట్టిన కుండల్ని తన్నుకొని పడిపోవడంతో, అవన్నీ పగిలిపోయీ, వాడి వళ్ళంతా గుచ్చుకొని గాయాలయ్యాయి. ఒక పెంకు నుదుటిమీద పెద్ద గాయం చేసింది.    

చిన్నగాయాలన్నీ మానిపోయినా, నుదుటిపైది మాత్రం చాలా కాలం అలాగే ఉండిపోయింది. క్రమంగా  అదికూడా నయమయినా, పెద్దమచ్చ మిగిల్చి వెళ్ళింది.  

కొంతకాలానికి ఆ రాజ్యంలో భయంకరమైన కరువు రావడంతో, ప్రజలందరూ పొరుగున ఉన్న ఇతర రాజ్యాలకి వలస పోతారు. రంగన్న కూడా ఒకరాజ్యానికి వెళతాడు. అదృష్ఠవశాత్తూ, వాడికి రాజుగారి ఆస్థానంలో కొలువు దొరుకుతుంది. వాడి బలమైన భుజాలూ, నుదుటిమీద పెద్ద మచ్చా చూసిన రాజుగారికి వాడు బహుశా పొరుగు దేశంలో గొప్ప యోదుడై ఉండవచ్చునని అనిపిస్తుంది. వాడు కూడా అంతకు పూర్వం `ఆయుద్దంలో, ఈ యుద్దంలో పాల్గొన్నా` నని నోటికొచ్చిన ప్రగల్బాలన్ని పలికి గొప్ప ప్రాముఖ్యత సంపాదించుకొన్నాడు. 

రోజులు హాయిగా గడచిపోతున్నాయి. రాజుగారు రంగన్నని ఎంతో అభిమానంతో చూసుకొంటున్నారు. అంతలో హఠాత్తుగా ఆ రాజ్యమ్మీద శత్రుసేనలు దండెత్తి వచ్చాయి. ఈ ఆపదను ఎదుర్కోవడానికి, యుద్ద ప్రణాళికలను రచించుకోవడానికి మంత్రులను, సైనికాధికారులను, యోధులను సమావేశపరిచారు. వాళ్ళతో పాటు రంగన్నకి కూడా కబురు వెళ్ళింది. ముఖ్యమైన వీరులందరికీ వివిధ బాధ్యతలను అప్పగించిన తరువాత, రాజుగారు ప్రత్యేకంగా రంగన్నని కూడా ఒక దళానికి నాయకత్వం వహించి యుద్దభూమిలోనికి వెళ్ళ వలసిందిగా ఆదేశించారు. 

రాజుగారి మాటకు ఎదురు చెపితే తలతెగుతుంది, నిజం బయటపెడితే పరువు పోతుంది. రంగన్న పరిస్థితి ముందు నుయ్యి, వెనుకగొయ్యిలా తయారయ్యింది. ఏదయితే అయ్యిందని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ సేనలతో పాటూ యుద్దరంగంలోనికి ఉరికాడు.

ఇంకేముందీ..........

అక్కడ కనిపించిన భీకరమైన వాతావరణం, నెత్తురూ చూసి ఠపీ మని కళ్ళుతిరిగి పడ్డాడు. 

యుద్దంచెయ్యాలంటే ముందు శిక్షణ తీసుకోవాలికదా? జీవితంలో ప్రతీపోటీ యుద్దంలాంటిదే. తగిన అనుభవం లేకుండా అత్యుత్సాహంతో ముందుకు పోతే, మొదలుపెట్టకుండానే పరాభవం ఎదురవుతుంది. 

ప్రతీ క్షణాన్ని, అవకాశాన్నీ సద్వినియోగం చేసుకొంటూ, నైపుణ్యాలను మెరుగు పరచుకొనేవాడే విజేత అవగలడు.

© Dantuluri Kishore Varma

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!