Pages

Wednesday 23 October 2013

అష్టాంగమార్గం

ఆగస్టు చివరిలో ఆనందానికి నాలుగు మెట్లు అనే పోస్టు రాయడం జరిగింది . జీవితంలో కష్టాలూ బాధలూ అనేవి సర్వసాధారణం, బాధలకి కారణం కోరికే, జీవితాన్ని ఏరోజుకారోజు జీవించడం, దు:ఖాన్ని అధిగమించడానికి అష్టాంగ మార్గాన్ని అనుసరించడం అనే ఈ నాలుగు విషయాలూ బుద్దుడు బోధించినవి. వాటిని గురించే ఆ పోస్టు (ఈ లింక్‌ని నొక్కండి).  అయితే ఆ టపాలో అష్టాంగ మార్గం గురించి వివరంగా రాయకుండా, మరోసారి రాస్తానని చెప్పాను. ఆటపానే ఇది.

బుద్దిజం చెప్పిన అష్టాంగమార్గం మతసంబంధ విషయంగా కంటే, వ్యక్తిత్వవికాస పాటంలా అనిపించింది. చెప్పాలనుకొన్నది సులభంగా అర్ధమయ్యేలా పాయింట్లగా విభజించి ఇవ్వడం బాగుంది. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి నేర్చుకోవలసిన, పాటించవలసిన అంశాలు ఎన్నో ఉంటాయి. నిరంతరం మాటని, నడవడికని, దృక్పదాన్నీ, ఆలోచనలనీ మెరుగుపరచుకొంటూ ఉండాలి. మనంజీవించే విధానం మిగిలినవారికంటే కూడా మనకే బాగుండాలి. ఫీల్‌గుడ్‌గా ఉండాలి. అలా ఉండడానికి ఏమి చెయ్యాలో ఎనిమిది అంశాలుగా(అష్టాంగమార్గంగా) వర్గీకరించి బుద్దుడు వివరించాడు.  అవి-

అష్టాంగమార్గం:

1. మాట(Word)
2. పని(Action)
3. సంపాదనామార్గం(Livelihood)
4. ప్రయత్నం(Effort)
5. స్పృహ(Attentiveness)
6. ఏకాగ్రత(Concentration)
7. ఆలోచన(Thought)
8. అవగాహన(Understanding)

ఇవి ఎనిమిదీ సవ్యంగా(దీనికి సమ్యక్ అనే మాటని ఉపయోగిస్తారు) ఉండాలి అని చెప్పాడు.

నైతికత:

కోపాన్ని, ద్వేషాన్ని, బాధని కలిగించే మాటలు, అబద్దాలు, చాడీలు, నిందలు, అర్థంపర్థం లేని వాగుడు, తిట్లు, అగౌరవప్రదమైన భాష మాట్లాడ వద్దని బుద్దుడు చెపుతాడు. స్నేహపూరితమైన, గౌరవప్రదమైన, సందర్భానుసారమైన మాటలు మాట్లాడాలి. నిజం చెప్పాలి అంటాడు. అదే సవ్యమైన మాట.

నీతిని, గౌరవాన్ని, శాంతిని కలిగించే పనులు చెయ్యాలి. దొంగతనం, మోసం, అక్రమసంబంధం, మద్యపానం, దూమపానం, చెడువ్యసనాలు వంటి అనైతికమైన పనులు వద్దు.

పరులను పీడించే, హింసించే సంపాదన వద్దు అంటాడు బుద్దుడు. ఉద్యోగమో, వ్యాపారమో, వృత్తో ఇతరులకి హానికలిగించనిదై ఉండాలి.

పైన చెప్పిన మాట, పని, సంపాదనా మార్గాలు నైతికతకి లేదా శీలానికి సంబంధించినవి.

మనసు/బుద్ది:

తరువాత వచ్చే ప్రయత్నం, స్పృహ, ఏకాగ్రత మనసుకి/బుద్దికి సంబంధించినవి. ఏదయినా మాట్లాడినప్పుడు, పనిచేసినప్పుడు, ఆలోచించినప్పుడు అది తప్పో, ఒప్పో అలోచించుకొనే స్పృహ ఉండాలి. తప్పునుంచి తప్పుకొని ఒప్పువైపుకి మరల్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అలా చెయ్యాలంటే ఏకాగ్రత అవసరం. ఏకాగ్రతని ద్యానం ద్వారా అభివృద్ది చేసుకోవచ్చు.

విజ్ఞానం:

అష్టాంగమార్గంలో చివరి రెండూ విజ్ఞానానికి సంబంధించినవి. సవ్యమైన ఆలోచన అంటే ఏమిటి? అంతా మనదే, అందరూ మనవాళ్ళే, ఇదంతా శాశ్వతం అనే బ్రమనుండి బయటపడడం; తోటి మనుస్యులతో, జంతువులతో, ప్రకృతితో ప్రేమతో ఉండే దృష్టిని అలవరచుకోవడం. చిట్ట చివరిది అవగాహన. పైన ఉపోద్ఘాతంలో చెప్పిన(ముదరి టపాలో రాసిన) బుద్దుడు బోధించిన నాలుగు విషయాలనీ సరిగా అవగాహన చేసుకొని, అవలంభించడం.

ఇదే అష్టాంగమార్గం!
`అలా చెయ్యడం సాధ్యమా!` అనే సందేహం వస్తుంది. కానీ, మనంచేసే అభిలషణీయంకాని పనులనే కొనసాగించమని ఏ మతమూ, ఏ సెఫ్ఫ్‌హెల్ప్‌బుక్కూ చెప్పవు. ఇంకొంచెం  మెరుగ్గా ఉండాలంటే, ఇంకొంచెం మెరుగయిన పనులు చెయ్యమని చెపుతాయి. అవి మనకంటే ఒక అడుగు పైనుండవచ్చు, పది అడుగులు పైనుండవచ్చు. కృషిచేసి అవలంభిస్తే అనుకొన్న లక్ష్యం క్రమంగా చేరుకోవచ్చు. అలా ప్రయత్నించే దృక్పదం ఉన్నవాళ్ళ కోసమే అవి.
© Dantuluri Kishore Varma 

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!